Monday 2 April 2018

హంస-కొంగ

 
       హంస,కొంగ...రెండూ పక్షి జాతికి చెందినవే! అయినా హంస హంసే!కొంగ కొంగే! దేని లక్షణం దానిదే!
       మనుషులూ అంతే కదా! అందరూ మనుషులే అయినా ఎవరి లక్షణం వారిదే!ఎవరి సంస్కారం వారిదే!
         సంస్కారాన్ని బట్టి వారి మాట తీరు,ప్రవర్తన వుంటుంది!ఎదుటి వారి మాట పట్ల స్పందన కూడా అలాగే వుంటుంది!
          కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు యీ విషయాన్ని చాలా అందంగా సున్నితంగా కొంగ-హంసల మధ్య సంభాషణగా పద్య రూపంలో చెప్పారు"
     చూడండి:
          కొంగ అడుగుతూ వుంది....హంస సమాధానం చెబుతూ వుంది

       ఎవ్వడ వీవు?కాళ్లు మొగ మెర్రన!
                                                    హంసమ!...ఎందునుందువో?
      దవ్వున మానసంబునను!  దాన విశేషములేమి చెప్పుమా?
    మవ్వపు కాంచనాబ్జములు, మౌక్తికముల్ కలవందు!....నత్తలో?
    అవ్వి యెరుంగ నన్న నహహా యని నవ్వె బకంబులన్నియున్ !

            హంసను చూచిన కొంగ అడిగింది....నీవెెవరవు?కాళ్లు మొగము ఎర్రగా వున్నాయే?
             హంసను!
            ఎక్కడ వుంటావు?
           చాలా దూరంలో మానస సరోవరంలో...
          అక్కడి విశేషాలేమిటి?
         మృదువైన బంగారు పద్మాలు,ముత్యాలు ఆసరోవరంలో వుంటాయి!
         నత్తలో?(కొంగలకు నత్త గుల్లలు యిష్టమైన ఆహారం)
        అవి నాకు తెలియవు!....అనింది హంస!
     నత్తలు తెలియవా?...అని కొంగలన్నీ పరిహాసంగా నవ్వాయట!

ఎవరి దృష్టి వారిది?కొంగల సంస్కారం అంతే!
వాటికి తెలిసింది నత్తలను తినడమే!అవి తెలియని వారు వాని దృష్టిలో
అమాయకులే! బంగారు కమలాలు ముత్యాల వంటి విలువైన వాని గురించి వాటికి పట్టదు!

              మనుషులు కూడా అంతే!వారి పరిధి లోనే ఆలోచిస్తారు!
అవతలివారి విజ్ఞానము తెలివి తేటల గురించి పట్టించుకోరు!
అవతలి వారి గూర్చి తెలుసుకొనేవాడు,తెలుసుకోవాలనుకొనే వాడు
తెలివిగల వాడిక్రిందకే లెక్క!


   -------కోడూరి శేషఫణి శర్మ

       




No comments:

Post a Comment